Friday, 24 July 2015

Post:-5. Some scenes from PANDAVA VANAVASAM WITH LYRICS OF DIALOGUES


"పాండవ వనవాసం"

1. రాజసూయానంతర సుయోధన పరితాపం

దుర్యో:- ఆహ్! అభిమానధనుడై, రాజాధిరాజులచే జేజేలనందుకొని, వారిని సత్కరించగల యీ సుయోధన సార్వభౌముని దక్షిణహస్తము... హు..రాజసూయసమయంలో వివిధ దేశాధీశుల అసంఖ్యాక రత్నరాశులను.. ధర్మజునికై స్వీకరించినది ఆహ్...ఇది రాజముద్రికాధారణకు అర్హము కాదు!! పరాభవభాజనమైన యీ హస్తము నిష్ప్రయోజనమూ, నిర్వీర్యము! ఇది క్షంతవ్యము కాదు. దీనిని ఛేదించినగాని నాకు మనశ్శాంతి లేదు!! (ఖండించుకొన బోవును)
దుశ్శా;- అన్నా! ఏమిటీ ఆవేశం, ఆక్రోశం?!
దుర్యో:- నన్ను వారించకు దుశ్శాసనా! అస్మదీయ పితృదయాలబ్ధ రాజ్యమాత్ర వైభవలై, సామంతులైన పాండవులు రాజసూయాధ్వర ప్రవర్తకులై, భద్ర సింహాసనాధీనులై, యీ రారాజును చూచి దరహసింతురే?! చతుస్సముద్ర వేలావలయిత ధరణీపట్టభద్రుడైన యీ కౌరవ చక్రవర్తిని చూచి ఒక బంధకి పంచభర్తృక ద్రౌపది పరిహసించునా?! దానిని సహించి రారాజు జీవించుటా? జీవించుటా దుశ్శాసనా?..యీ పరాభవానికి తగిన ప్రతీకారం జరుగవలసిందే! పగ సాధించవలసిందే!
దుశ్శా:- అన్నా! నీ పగ సాధించడానికి నూర్గురు తమ్ములమున్నాం. నీగౌరవానికి మా ప్రాణాలు వెలబోస్తాం.
దుర్యో:- కాదు దుశ్శాసనా! అది నీ వల్ల కానేకాదు. భీష్మద్రోణకృపాశ్వథ్థామబాహ్లికసోమదత్తాది ప్రముఖ వీరాధివీర పరివృతుడై అనేకాక్షౌహిణీ చమూసమేతుడైన యీ సుయోధనుని పరాక్రమము వక్రము. ఆభిజాత్యము వ్యర్ధము. ఉద్దండవైరిమండలహృదయవేదండప్రచండమైన యీ గదాదండము నిస్సారమూ నిరర్ధకము.
కర్ణ:- ఆజ్ఞాపించండి రారాజా! కయ్యములో గాండీవినోడించగల యీ కర్ణుడున్నాడు. నా శస్త్రాస్త్ర శక్తితో నిమేషమాత్రములో పాండవులను నిర్జించి, ప్రాణాలతో బంధించి, మీ పాదాలముందుంచుతాను.
శకు:- హ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హ! అది నీవనుకున్నంత సులభసాధ్యంకాదు కర్ణా! యుక్తికి మించిన శక్తి వేరేముంది. యుక్తికి ఆరాధ్యమూ అధినేత యీ శకుని మామ యింకా జీవించేవున్నాడు. సుయోధనా! నెత్తురుబొట్టు నేలరాలకుండా నీకు విజయాన్ని సాధించి పెడతాను. యిదిగో చూడు.
దుశ్శా:- పాచికలు!
శకు:- హ్హహ్హహ్హహ్హ! అవును, పాచికలే! ద్యూతంలో, ఒక్క ఆటతో పాండవుల ఆట కట్టించి, రాజ్యలక్ష్మీసమేతంగా వారిని నీ పాదదాసులను చేస్తాను అల్లుడూ!
దుర్యో:- మర్చిపోతున్నారు మామా! ధర్మరాజు సామాన్యుడు కాడు. జూదవిద్యావిశారదుడు.
శకు:- హ్హహ్హహ్హహ్హ! ఇవి అందరూ ఆడే పాచికలు కావు అల్లుడూ! వీటికి అపురూపమైన ప్రభావం వుంది. చూడు...
దుశ్శా:- మామా! యేమిటీ ఆక్రందనం?!?!
శకు:- అవును! ఆక్రందనమే! వాటికి ఆత్మశాంతి కావాలి! సుయోధనా రాబొయ్యే పాండవుల విషాదగీతాన్ని నా పాచికలు ముందుగానే సూచిస్తున్నై. మనం పలకమన్న పందెం పలుకుతై. దుశ్శాసనా! నీకేం కావాలో కోరుకో.
దుశ్శా:- వెయ్యి మామా..మూడూ..నాలుగు.
శకు:- !
దుశ్శా:- !
శకు:- మూడూ..నాలుగు...ఓం పితృభ్యోన్నమహః..
కర్ణ:- మామా! నువ్వు వెయ్యడంకాదు మమా! మేం వెయ్యాలీ, మీరు గెలవాలి.
శకు:-  కానీ!
కర్ణ:- !అడగండి.
శకు:- రెండూ మూడు.
దుశ్శా:- కాదు! మూడూ నాలుగు పడాలి.
దుశ్శా:- భళా! అద్భుతం మామా అద్భుతం!!
శకు:- హ్హహ్హహ్హహ్హ! ఇప్పటికైనా మన పాచికల ప్రభావం తెలిసిందా అల్లుడూ!
దుర్యో:- మామా! నీ ప్రావీణ్యం ప్రశంసనీయం! తమ్ముడూ! వెంటనే ధర్మజుణ్ణి ఆహ్వానించి తీసుకురా!
శకు:- అన్నిటికీ తొందరేనా సుయోధనా! మన దుశ్శాసనుడు వెళితే అయ్యే పనికూడా కాదు. ధర్మరాజును విదురుడే అహ్వానించాలి. విదురుని మీ తండ్రిగారు ధృతరాష్ట్ర మహారాజు ఆదేశించాలి. అప్పుడూ... మన పని నెరవేరినట్లు.
దుర్యో:- అదెంత పని మామా?! యీ రారాజు తండ్రిని ఒప్పిస్తాడూ, పాండవులను రప్పిస్తాడు. రండి!
శకు:- హ్హహ్హహ్హహ్హహ్హహ్హ


     (In these scenes my voice is dubbed and re-recorded)



2. ( ఘోషయాత్రానంతరం దుర్యోధనుని పరితాపం - శకుని దుర్బోధ)

దుర్యో:- అవమానము! వేటుతినీ కాటునకై వేచే త్రాచులవంటి దాయాదులచే బంధవిముక్త దురంత దుస్సహ మహావమానము! దుర్భర పరాభవము! ఆహా! భూమి బ్రద్దలై యీ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ఇముడ్చుకోదు?!హుఁ! యీ మందభాగ్యునకు అంతటి అదృష్టముకూడనా?!
జయించిన దానితో తృప్తినందక, దురభిమాన మాత్సర్య సంకంల్పిత మానసుడనై యీ ద్వైతవనానికేల రావలె? అవహేళన చేయవచ్చి అవమానమునేల పొందవలె? ఛీఛీఛీ...
ధర్మ:- సుయోధనా! సాహసం సర్వదా జయప్రదంకాదు నాయనా! కాలం ఎప్పుడూ మనదికాదు. మానవశక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజే సేవకుడౌతాడు, సేవకుడు రాజౌతాడు. యీ సత్యాన్ని గుర్తుంచుకో నాయనా!
భీమ:-హ్హహ్హహ్హహ్హహ్హ! దాయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న యీ తుఛ్ఛ ప్రాణాన్ని యేంచేస్తావు, ఒడ్డి జూదమాడతావా? మరణించి మట్టిపాలు చేస్తావా? ఫో! అరువుతెచ్చుకున్న ప్రాణాలు అరిచేతిలో వుంచుకొని హస్తినాపురికెళ్ళు!
ధర్మ:- సుయోధనా! జరిగిన దుస్సంఘటన మర్చిపో నాయనా! భీమసేనా! తమ్ముణ్ణి బంధవిముక్తుణ్ణి చెయ్! ఊఁ!
దుర్యో:-అహ్!
అత్మ:- ఏం దురభిమాన దుర్యోధనా! భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాలపరివృథ గర్జనములై ఛిద్రములైనవి కదూ! యుధిష్టిరుని ఉపశమనబోధలు నీ వెడదహృదయమును తుత్తునియలుచేయు మరణాఘాతములైనవి కదూ! చతుస్సముద్రవేలావలయుత ధరణీపట్టభద్రుడవు, కౌరవసామ్రాజ్య సింహాసనాధీశ్వరుడవు, సుయోధన సార్వభౌముడవు! ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము? ఎక్కడ నీ హంసతూలికాతల్పములు? వినిపించవే సుప్రభాతగీతికలు?..ఆక్రోశించునది కౌంతేయులుకాదు! అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే! నీవే అభాగ్యుడవు. అసమర్ధుడవు!
దుర్యో:- ధిక్! ఆపు నీ దుష్ప్రలాపములు! చివరకు నిన్ను నీవే నిందించుకునే హీనస్థితికి దిగజారితివా?! ఫో!
ఆత్మ:- హ్హహ్హహ్హహ్హహ్హహ్హ   హ్హహ్హహ్హహ్హహ్హ  హ్హహ్హహ్హహ్హ! ఆగు! యీ అవమానిత వదనంతో భీష్మద్రోణభూరిశ్రవబాహ్లికసోమదత్తాది కురువృధ్ధుల సమ్ముఖానికి యెటుల పోగలవు? నీవు మరల అంతఃపురకాంతలతో యెటుల సుఖించగలవు? ఇక నీవు పౌరజనులతో భాషించలేవు! పాలించలేవు! రారాజుగా జీవించలేవు! లజ్జావిహీనమైన యీ జీవన్మరణముకన్న నీకు మరణమే మేలు! హ్హహ్హహ్హ నీకు మరణమేమేలు! నీకు మరణమేమేలు! నీకు మరణమేమేలు! నీకు మరణమేమేలు! నీకు మరణమేమేలు!  ఆఁ!నీకు మరణమేమేలు! నీకు మరణమేమేలు!
దుర్యో:- ఆహ్!..అవును.. మరణమే మేలు...మరణమే మేలు...దుశ్శాసనా! దుశ్శాసనా!
దుశ్శా:- అన్నా!
దుర్యో:- హస్తినాపురానికీ, నాకూ రుణం తీరిపోయింది దుశ్శాసనా! ఇక యీ అరణ్యమే నాకు శరణ్యం. ప్రాయోపవేశమే నా కర్తవ్యం. మరణ పర్యంతం శ్వేతవస్త్రాఛ్ఛాదిత భూతలశయనమే నాకాశ్రయం. పరిపించు దుశ్శాసనా!.
దుశ్శా:- అన్నా!
దుర్యో:- నా నిర్ణయానికి తిరుగులేదు. దుశ్శాసనా! సువర్ణ కలశంతో జలం తెప్పించు. నిన్ను కౌరవ సామ్రజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. బంధుమిత్ర సామంత పరివేష్టితుడవై..పాలించి సుఖించు.
దుశ్శా:- అన్నా! నీవొల్లని సామ్రాజ్యం నాకేల?!  నిన్ను చూచుకొనే నీ నూర్గురు సోదరులం జీవిస్తున్నాం. నీవులేని హస్తినాపురంలొ అడుగు పెట్టలేము, తండ్రిగారికి మా ముఖం చూపించలేము. అన్నా! నీ కఠోర నిర్ణయం మార్చుకో!
కర్ణ:- కౌరవ సార్వభౌమా! యేమిటీ విభ్రమం?! యీ అవివేకమూ, యీ శోకమూ చూచి శతృవులు మరింత పరిహసిస్తారు. హుఁ ! పాండవులు నిన్నవమానించారనీ భ్రమపడుతున్నావు సుయోధనా! ఆనాడు నీచే పరాజితులైన పాండవులు నీ దాసులు. మహరాజును ఆపత్సమయంలో అదుకోవడం వారి విధీ, వారి ధర్మం!.గోరంతలు కొండంతలుచేసి దుఃఖించడం రాజోచితం కాదు.
దుర్యో:- ఆఁ ! నీకర్ధముకాదులే అంగరాజా! భీమార్జునులు, గంధర్వరాజు యెదుట నాపై చూపిన అభిమానమూ, దవానలము వలె నన్ను దహించుచున్నది. జాతభంగములవలే వారి పల్కులు ముల్కులై నన్ను వేధించుచున్నవి. మయసభలో జరిగిన పరాభవముకన్న యిది భయంకరమూ, నికృష్టమూ కర్ణా! యింకనూ యేమి సాధించుటకు నేను జీవించి యుండవలె?!
కర్ణ:- చచ్చి సాధించ గలిగింది లేదు. జీవించి, సమయం చూచి, శతృవును సాధించాలీ, నిర్జించాలి. అదే ధీర లక్షణం!
దుర్యో:- ఆశ నేటితో పేరాశయైపోయినది కర్ణా! నా అద్వితీయ గదాయుధ్ధ కౌశలము, నీ అఖండ శస్త్రాస్త్ర విక్రమాటోపమూ- పాండవుల కడగంటి చూపులకుకూడా సరిరావని తేలిపోయినది. అహ్! ధర్మజుడు చెప్పినట్లు, యేదో ఒక మహత్తర మానవాతీత శక్తి వారిని సదా పరిరక్షిస్తున్నదని నేటితో రూఢియైపోయినది. లేనిచో, పాంచాలీ వస్త్రాపహరణ పరిక్లేశమునుండి వారు బయట పడుటేమీ? దుర్వాస శాపాగ్నిలో దగ్ధులుకాక విముక్తులగుటేమి? అరణ్యవాస క్లేశమున హతాశులై అంతరించవలసిన భీమార్జునులు అద్భుతశక్తివంతులై, దివ్యాస్త్ర సంపన్నులై, అభిమానధనుడైన యీ సుయోధనుని బంధవిముక్తునిచేసి పరిహసించి పంపుటేమి? ఆఁ కర్ణా! మనకు అందని యేదో ఒక మహత్తర అజ్ఞాత శక్తి వారిని సంరక్షించుచున్నది.
శకు:- మహత్తర శక్తికాదు అల్లుడు! అది మాయలమారి చేసే మహేంద్రజాలం!
దుశ్శా:- ఎవరు మామా మాయలమారి?
శకు:- ఇంకెవరు? మాయలకు మూలం.మోసాలకు ఆలవాలం, కపటనాటక సూత్రధారి- శ్రీకృష్ణుడే!
దుర్యో:- ఆఁ!
శకు:- ఆఁ! అతడే నీ శతృవులకు శక్తీ, యుక్తీ, సర్వం! సుయోధన! కృష్ణపాండవుల అంతఃకలహాలకు మనమే అంకురార్పణచేస్తే...
దుర్యో:- చాలించు మామా! గగనకుసుమాలవంటి నీ శుష్కవచనాలు నమ్మి నన్నింకనూ జీవఛ్ఛవంవలె బ్రతికుండమందువా? ఆఁ!
శకు:-హ్హహ్హహ్హహ్హహ్హహ్హ! కౌరవ సార్వభౌముడేనా యీ బీరాలాపాలు పలికేది?! కౌంతేయుల అంతంచూడడమే నీ ఆశయం అన్నావే! బ్రతికినన్నాళ్ళూ రారాజుగా బ్రతుకుతానన్నావే! యీనాడు పంతాలు మరచి, ధర్యం విడచి. హవ్వ...ఆత్మహత్యకు పాల్పడతావా నాయనా? యీ అప్రతిష్ట, కురువంశానికే కళంకమై కలకాలం నిలిచిపోతుంది, ఆలోచించు. ఆనాడు పాందవుల సర్వస్వాన్నీ హరించి అడవుల పాల్జేసిన యీ శకునిమామ శక్తినే శంకిస్తున్నావుకదూ సుయోధనా?! చూడు..దేహప్రాణాలవలె జీవించే కృష్ణపాండవులను నేను వేరుచేస్తాను.
దుర్యో:- అది అసాధ్యం మామా!
శకు:- అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యటమే ప్రజ్ఞ! !సుయోధనా! బలరామదేవునికి నీవు ప్రియ శిష్యుడవు కదూ!
దుర్యో:- అవును.
శకు:- నీవంటే అతనికి అత్యంత వాత్సల్యమూ, అభిమానమూ కదూ!
దుర్యో:- నిస్సందేహముగ!
శకు:- హా! అలాగే అన్న బలరాముడంటే శ్రీకృష్ణునికి కూడా అంత ప్రేమా,గౌరవాభిమానాలూ వున్నయ్యి. బలరామిని మాటంటే శ్రీకృష్ణుడు జవదాటడయ్యా! మంత్రముగ్ధుని వలె కట్టుబడిపోతాడు! బలదేవునితో ఇఛ్ఛికములాడి, మనసును మెప్పించి, అతని కుమార్తె శశిరేఖను మన లక్ష్మణకుమారునికిచ్చి కల్యాణం జరిపించామనుకో..ఏమౌతుంది?!
దుశ్శా:- భళా మామా! పాడవులకన్నా మనమే దగ్గర బంధువులమౌతాము.
కర్ణ:- మనము దగ్గరౌతున్నకొద్దీ పాండవులు కృష్ణుడికి దూరమౌతారు.
శకు:- అప్పుడు వారి గోడు అరణ్య రోదనమే!
దుర్యో:- బాగానేవుంది మామా! కాని, యీ సంకల్పాన్ని కర్యరూపానికి తెచ్చే ప్రతిభావంతుడెవరు?
శకు:- యింకెవరు?! పాపాలభైరవుణ్ణి నేనున్నానుగా! బాధలూ, బాధ్యతలన్నీ నాకు వొదిలెయ్. శశిరేఖా లక్ష్మణకుమారుల కల్యాణం జరిపించడం నావంతు. నీ ప్రాయోపవేశానికి స్వస్తి చెప్పి నిశ్చింతగా రాజధానికి బయల్దేరు.
దుర్యో:- మామా!

No comments:

Post a Comment